జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు నగారా మోగిన విషయం తెలిసిందే. అక్టోబర్ 21వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. అక్టోబర్ 22న నామినేషన్ల పరిశీలన ఉండగా.. నామినేషన్ల ఉపసంహరణకు తుది గడవు అక్టోబర్ 24. ఉప ఎన్నికకు నవంబర్ 11న పోలింగ్ జరగనుండగా.. నవంబర్ 14వ తేదీన ఫలితాలు వెలువడనున్నాయి. ఉప ఎన్నిక కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్షం బీఆర్ఎస్ సహా బీజేపీ సిద్ధమయ్యాయి. అభ్యర్థులను ప్రకటించిన ఈ మూడు పార్టీలు.. ప్రచారం మొదలెట్టాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వేళ సోషల్ మీడియాలో ఓ న్యూస్ చక్కర్లు కొడుతోంది.
జూబ్లీహిల్స్లో ప్రముఖ హీరోయిన్స్కు ఓటు ఉందంటూ సోషల్ మీడియాలో ఫేక్ ఓటర్ కార్డులు చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ హీరోయిన్లు రకుల్ ప్రీత్ సింగ్, సమంత, తమన్నాల ఫోటోలతో ఫేక్ ఓటర్ ఐడీలు క్రియేట్ చేసి ప్రచారం చేస్తున్నారు. వేరే ఓటర్ల ఎపిక్ నంబర్తో హీరోయిన్ల ఫోటోలు పెట్టి ఓటర్ ఐడీ కార్డులు సృష్టించారు. ఫేక్ ఓటర్ ఐడీల ప్రచారంపై హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు సీరియస్ అయ్యారు. ఓటర్ ఐడీలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులకు ఫిర్యాదు అందింది. ఎక్కడ వీటిని ఫ్యాబ్రికేట్ చేశారు, ఎవరు ప్రచారం చేశారు అన్న అంశాలపై ఎన్నికల సంఘం విచారణ చేస్తోంది.